సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఘ‌ట‌న‌పై ఎవ‌రు ఎమ‌న్నారంటే..?

Leaders Respond on Secunderabad Railway Station incident.కేంద్రం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2022 8:58 AM GMT
సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఘ‌ట‌న‌పై ఎవ‌రు ఎమ‌న్నారంటే..?

కేంద్రం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళ‌నలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన విధ్వంసం పై ప‌లువురు నేత‌లు స్పందించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఈ ఆందోళన అన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే 'అగ్నిపథ్' సరైనది కాదన్నారు. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలన్నారు.

ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే..

ఆర్మీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న అభ్య‌ర్థుల ముసుగులో కొంత మంది వ‌చ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌పై దాడి చేశార‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. హైద‌రాబాద్ నుంచి బాస‌ర ట్రిపుల్ ఐటీకి బ‌య‌లుదేరిన ఆయ‌న సికింద్రాబాద్ అల్ల‌ర్ల‌పై స్పందించారు. టీఆర్ఎస్‌,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి చేసిన కుట్ర‌లో భాగ‌మే ఈ అల్ల‌ర్లని తెలిపారు. ఇంత మంది ఆందోళ‌న‌కారులు వ‌స్తుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇదంతా ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం దాడి చేసిన దాడి ఇది. ముసులు వేసుకుని వ‌చ్చి దాడికి పాల్పడ్డారు. అందుకే తెలంగాణ‌లో బుల్డొజ‌ర్ ప్ర‌భుత్వం రావాలి. అగ్నిప‌థ్ పేరుతో అభ్య‌ర్థులకు అన్యాయం చేసే ఆలోచ‌న కేంద్రానికి లేదు. కొంద‌రు వారిని త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు. విద్యార్థులంతా గొప్ప వ్య‌క్తులు. వాళ్లు ఇలా చేస్తార‌ని నేను అనుకోను. నిన్నటి కాంగ్రెస్ దాడి, ఈరోజు అల్ల‌ర్లు పూర్తిగా టీఆర్ఎస్ ప్రోద్భ‌లంతోనే జ‌రిగాయ‌న్నారు.

మాకు సంబంధం లేదు.. బ‌ల్మూరి వెంక‌ట్‌

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త‌పై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట్ స్పందించారు. రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఆర్మీ నియామ‌క ప‌రీక్ష ర‌ద్దు కావ‌డం వ‌ల్ల గ‌త 48 గంట‌ల్లో చాలా మంది అభ్య‌ర్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. దీంతో ఆవేశానికిలోనైన అభ్య‌ర్థులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ సంఘ‌ట‌న‌తో ఎన్ఎస్‌యూఐకి ఎటువంటి సంబంధం లేదు. అభ్య‌ర్థుల నిర‌సన‌లో మా ప్రమేయం పై వ‌స్తున్న వార్త‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది క‌లిగించే కార్య‌క‌లాపాల‌ను ఎన్ఎస్‌యూఐ చేయబోద‌న్నారు.

Next Story