24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు సిద్ధం..కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా అని రేవంత్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  17 July 2023 1:39 PM GMT
BRS, Congress, Revanth Reddy, KTR,

24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు సిద్ధం..కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

తెలంగాణలో పవర్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉచిత విద్యుత్‌ గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత.. వాటిపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. తాము నాణ్యమైన 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తున్నామంటూ కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాదు.. 3 గంటలు పాటు విద్యుత్ ఇస్తే సరిపోతుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 3 గంటల కరెంటు కావాలా.. 3 పంటలు కావాలా అంటూ కేటీఆర్ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు రేవంత్‌రెడ్డి. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే 24 గంటలు ఇస్తున్నారు. ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తాను.. చర్చకు కేటీఆర్ వచ్చేందుకు సిద్ధమా..? ఎక్కడి రావాలో చెప్తే వచ్చి తేల్చుకుందాం అంటూ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

రేవంత్‌రెడ్డి తాను ఉచిత విద్యుత్‌ను, ప్రజల సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకూడదని తానా వేదిక చెప్పానని అన్నారు. దాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉచిత కరెంట్‌ అనేటి పేటెంట్‌ కాంగ్రెస్‌ది. కానీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌ అస్సలు కరెంటే ఇవ్వలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్లు ఒకే విషయాన్ని పట్టుకుని రాద్దాందం చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మీరు కాదు మేమే చర్చకు పిలుస్తున్నాం.. ఎక్కడికి వస్తారో చెప్పాలని అన్నారు. రైతు వేదికల్లో చర్చ పెడదామని.. కేటీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

చర్చకు నేను కూడా వస్తాను అని రేవంత్‌ అన్నారు. ఉచిత కరెంటు ఇవ్వలేదన్నది నిరూపించాం, ఇప్పుడు కూడా ఆ మాటకు నేను కట్టుబడి ఉంటానని రేవంత్‌రెడి తెలిపారు. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 3,500 సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్కులను సీజ్ చేసింది. తెల్ల కాగితాలపై రాసుకునే దివాళా పరిస్థితి వచ్చిందంటే.. ప్రభుత్వం కరెంట్‌ను ఏవిధంగా అవినీతికి వాడుకుంటోందో ప్రజలకు గమనించాలని రేవంత్‌రెడ్డి కోరారు. సిద్దపేట చింతమడకలో కేసీఆర్ పుట్టిన ఊరికి రావాలా? గజ్వేల్‌ రైతు వేదికకు రావాలా? విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న తుంగతుర్తికి రావాలా? కేటీఆర్‌ స్పష్టం చేయాలని అన్నారు. మేం చర్చకు సిద్ధంగా ఉన్నామని, 24 గంటల కరెంటు ఇస్తలేరని ఆధారాలు ఉన్నాయి వాటితో వస్తామని.. తేల్చుకుందాం అంటూ మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

Next Story