బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా: బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు

బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ వరుస షాక్‌లు తగులుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 March 2024 8:45 AM GMT
bjp, raghunandan rao, comments,  brs, telangana,

బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా: బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు

బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు తో పాటు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఆయన కుమార్తె కావ్యకు బీఆర్ఎస్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చిన తాజా పరిణామాలతో నిరాకరిస్తున్నట్లు చెప్పారు. దాంతో.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇతర నేతలను కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు పలు కామెంట్స్ చేశారు.

నాయకులంతా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెబుతున్న పరిణామాలపై బీజేపీ మెదక్ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు స్పందించారు. శుక్రవారం రఘునందన్‌ రావు జిల్లాలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ పార్టీ మునిగిపోయే నావా అని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఆ నావా మునిగిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకునే పరిస్థితి నుంచి.. ఇచ్చిన టికెట్లను కూడా నిరాకరించే పరిస్థితులు వచ్చాయన్నారు. అంటే ఆ పార్టీ టికెట్‌పై పోటీచేస్తే తమ ఇమేజ్‌ చెడిపోతుందని పార్టీ నాయకులే భావిస్తున్నారని రఘునందన్‌ రావు కామెంట్ చేశారు. పార్టీలో ఉండకూడదనీ కారు దిగి వెళ్లిపోతున్నాని చెప్పారు. దాంతో.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీకి ఓటమి తప్పదని అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి ఒక్క అభ్యర్థి గెలవడు అంటూ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండబోతుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. అయితే.. మెజార్టీ సీట్లను గెలిచేది మాత్రం తామే అని దీమా వ్యక్తం చేశారు.

Next Story