Fact Check : భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 8:41 AM GMT
Fact Check : భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారా..?

భారతదేశంలోని మురికివాడల్లో ప్రజలు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని.. అందుకు సాక్ష్యమే ఈ ఫోటోలు అంటూ మురుగునీటి పైపుల్లో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు నివాసం ఉంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

మలయాళంలో పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. రామ మందిరం నిర్మాణం జరుగుతోందని మనం ఆనంద పడుతున్నాం. కానీ వీధుల్లో కనీసం తలదాచుకోడానికి చోటు లేని వారు ఎంతో మంది ఉన్నారంటూ పోస్టు పెట్టారు. మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

భారతదేశంలో డ్రైనేజ్ పైపుల్లో జనం బ్రతుకుతున్నారంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోను ఫైజల్ ఆజిమ్ అనే వ్యక్తి తీశారు. Atkins Cityscape అవార్డును 2014లో సొంతం చేసుకుంది ఈ ఫోటో..!

The Guardian’s Atkins CIWEN ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2014 విజేతల లిస్టులో ఈ ఫోటో వచ్చింది. ఈ ఆర్టికల్ కథనం ప్రకారం 2013లో ఈ ఫోటోను బాంగ్లాదేశ్ లో తీశారు. "లైఫ్ ఇన్ ది సర్కిల్" అంటూ బాంగ్లాదేశ్ లోని పరిస్థితిని ఆయన చూపించారు.

Daily Mail, My Green Pod, Amateur Photographer లాంటి వెబ్ సైట్స్ ఈ అవార్డు గెలిచిన ఫోటోగ్రాఫ్ ను ప్రచురించాయి.

ఈ ఫోటోను తీసింది ఫైజల్ ఆజిమ్ అంటూ ప్రముఖ జర్నలిస్ట్ కాంచన్ గుప్తా షబానా అజ్మీకి ట్వీట్ ద్వారా తెలిపారు. బాంగ్లాదేశ్ కు చెందిన ఫైజల్ ఆజిమ్ ఈ ఫోటోను తీశారని.. ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని కాంచన్ గుప్తా తెలిపారు. ఈ ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆయనకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారంటూ వైరల్ అవుతున్న ఫోటో భారత్ కు చెందినది కాదు. 2013 లో బాంగ్లాదేశ్ లో ఫైజల్ ఆజిమ్ తీసిన ఫోటో. 2014లో ఈ ఫోటోకు అవార్డులు కూడా లభించాయి.

Also Read

Next Story