రాయలసీమలో జనసేన నేత పవన్ కల్యాణ్ పర్యటన
By Newsmeter.Network Published on 1 Dec 2019 4:54 PM ISTరాయలసీమ రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకోవడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన నేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. సీమలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆహ్వానం పలికారు. ఎయిర్ పోర్టు ప్రాంగణం జనసేన నినాదాలతో దద్దరిల్లింది. వందలాది బైక్ లు, పదుల సంఖ్యలో కార్లు అనుసరించగా రేణిగుంట నుంచి రైల్వే కోడూరుకు కదిలారు. పవన్ పర్యటన సందర్భంగా ప్రతి గ్రామ కూడలి వద్ద జనసైనికులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి హారతులతోస్వాగతించారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పర్యటన కొనసాగించారు.