ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోలుకోవాలని పవన్ ట్వీట్
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కాగా.. నిన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు చేయటంతో పాజిటివ్ అని తేలిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.71 ఏళ్ళ వయస్సు ఉన్న వెంకయ్య నాయుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.
తాజాగా నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ “మన భారత దేశ – గౌరవ ఉప రాష్ట్రపతి ‘శ్రీ వెంకయ్య నాయుడుగారు ‘ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు హాజరైన విషయం తెలిసిందే.