ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఏసీ వేసుకుని నిద్రపోయాడు.. పోలీసులు లేపడంతో

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం (జూన్ 2) ఓ వ్యక్తి దొంగతనానికి ప్రవేశించిన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోయాడు.

By అంజి  Published on  3 Jun 2024 7:00 AM GMT
Thief, Lucknow, Uttarpradesh, Viral news

ఇంట్లో దొంగతనానికి వచ్చి.. ఏసీ వేసుకుని నిద్రపోయాడు.. పోలీసులు లేపడంతో 

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం (జూన్ 2) ఓ వ్యక్తి దొంగతనానికి ప్రవేశించిన ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోయాడు. నిద్రపోతున్న అతడిని లేపిన పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి విపరీతంగా మద్యం సేవించి, ఎయిర్ కండీషనర్‌ను కనుగొని దానిని ఆన్ చేయడంతో ఇంట్లోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి వ్యక్తి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. వారణాసిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ పాండేకు చెందిన ఇంటిలో ఈ ఘటన జరిగింది. ఇల్లు ఖాళీగా ఉందని గుర్తించిన వ్యక్తి ఇంటి ముందు గేటు తెరిచి లోపలికి ప్రవేశించాడు.

ఇంట్లోని డ్రాయింగ్ ఏరియాకు వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ఎయిర్ కండీషనర్‌ను గమనించి స్విచ్ ఆన్ చేశాడు. తరువాత, అతను హాయిగా నేలపై పడుకుని, ఒక కుషన్ మీద తల ఉంచాడు. వెంటనే నిద్రపోయాడు. ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో డాక్టర్ పాండే ఇరుగుపొరుగు వారు అతడికి సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అతను లక్నోలో లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎయిర్ కండీషనర్ ఆన్ చేసి హాయిగా నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తించారు.

దొంగ తన కుడిచేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని గాఢనిద్రలో ఉన్నట్లు చూపుతున్న చిత్రం వైరల్‌గా మారింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. "అతను విపరీతంగా తాగి ఉన్నాడు, దాని కారణంగా అతను నిద్రపోయాడు. మేల్కొనలేకపోయాడు. ఇరుగుపొరుగు వారు నివేదించారు, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు," అని అధికారి చెప్పారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story