ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2020 7:52 AM GMT
ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇటీవలే నిమ్మగడ్డను పునర్నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందని తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నాననని, శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశామని రమేష్ కుమార్ వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్‌ ప్రకటించింది. ఓ పక్క ఎన్నికల నిర్వహణ కొనసాగుతుండగానే.. దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మార్చి 18న ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. దీంతో ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా రమేశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టింది.

దీనిని సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్ని రద్దు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి రమేశ్‌కుమార్‌ను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషిన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా గవర్నర్‌ను కలిపి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. హైకోర్టు సూచనలు నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌ను నియమిస్తూ గత గురువారం అర్థారత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story