హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. జాగ్రత్త సుమీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2020 9:01 AM GMT
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. జాగ్రత్త సుమీ..!

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రజలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. దేశంలోని తొమ్మిది అర్బన్ నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణేల్లో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పుణేలు కోవిద్-19 హాట్ స్పాట్ లు మారినట్లు సరికొత్త గణాంకాలు చెబుతున్నాయి.

బెంగళూరు నగరంలో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. దీంతో వారం రోజుల పాటూ బెంగళూరు అర్బన్, రూరల్ లో లాక్ డౌన్ ను విధించారు. కేవలం అత్యవసర సర్వీసులకు, మరికొన్ని సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.

మెట్రో నగరాలలో కరోనా మరణాలకు వస్తే ముంబయి, కోల్‌కతా తర్వాతి స్థానంలో అహ్మదాబాద్ ఉంది. కేసుల విషయంలో చెన్నైలో 10 లక్షల మందికి 8,595 కేసులు చొప్పున నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ముంబయి, పుణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా ముంబయిలోని ప్రతి 10 లక్షల మంది జనాభాకు 345 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలు ముంబై తర్వాత నిలిచాయి.

కొత్త పట్టణ కేంద్రాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తున్నట్టు గత నాలుగు వారాల్లోని లెక్కలను చూస్తే అర్థమవుతోంది. పాజిటివ్ కేసులలో రోజువారీ సగటు వృద్ధి రేటు ముంబైలో తగ్గుతోంది. చెన్నై నగరంలో కరోనా వైరస్ మందగించినట్లు తాజాగా సర్వే ద్వారా తెలుస్తూ ఉండగా.. హైదరాబాద్, బెంగళూరులలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదయిన ముంబైలో కరోనాఅదుపులోకి వచ్చినప్పటికీ ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్‌లోని థానే, కళ్యాణ్, నవీ ముంబై, భివాండి శాటిలైట్ టౌన్‌షిప్‌లలో పెరుగుదల ఉంది. థానే, కళ్యాణ్, నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే 10,000 కి పైగా కేసులు నమోదవ్వగా.. ముంబై నగరంలో కంటే ప్రస్తుతం థానే, పుణే జిల్లాల్లో ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా మరిన్ని నగరాలకు వైరస్ వ్యాపించడమే కాకుండా, కేసుల నమోదులోనూ మార్పులు ఉన్నాయని అంటున్నారు.

బెంగళూరు, హైదరాబాద్, పూణేలు అర్బన్ కోవిద్ హాట్ స్పాట్ లు గా మారగా.. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కరోనాను అదుపు చేయడానికి బెంగళూరు నగరాన్ని వారం రోజుల పాటూ లాక్ డౌన్ లో ఉంచింది. ఇక హైదరాబాద్, పూణే నగరాల్లో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

Next Story