భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 34,884కేసులు.. 671 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 6:05 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 34,884కేసులు.. 671 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తరువాత నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,884 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 671 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలు అయిన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 10,38,716 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 26,285 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 6,53,750 కోలుకుని డిశ్చార్జి కాగా.. 3,58,692 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,34,33,742 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,61,024 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇక భారత్‌లో అత్యధిక కరోనా కేసులు మహరాష్ట్రలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ 2.84లక్షల కేసులు నమోదు కాగా.. 11,194 మంది మరణించారు. తమిళనాడులో 1.56లక్షల కేసులు నమోదు కాగా.. 2,236 ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 1.19లక్షల కేసులు నమోదు కాగా.. 3,545 మంది చనిపోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో. అమెరికా 36.8లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌లో 20.6లక్షల కేసులతో రెండో స్థానంలో ఉంది.

Next Story