న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమరశంఖం పూరించింది. తమ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12న (గురువారం) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్, ఉత్పత్తి రంగాలు స్తంభించిపోయే అవకాశం ఉంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
గతేడాది జూలై 9న జరిగిన సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొనగా, ఈసారి అంతకంటే ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ.. "ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో కనీసం 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారు. గతసారి జూలై 9న జరిగిన ఆందోళనలో సుమారు 25 కోట్ల మంది పాల్గొన్నారు," అని తెలిపారు.