Video : బరితెగింపు.. ప‌ట్ట‌ప‌గ‌లు మహిళను వేధించిన పోకిరీలు

జైపూర్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

By -  Medi Samrat
Published on : 11 April 2026 8:00 PM IST

Video : బరితెగింపు.. ప‌ట్ట‌ప‌గ‌లు మహిళను వేధించిన పోకిరీలు

జైపూర్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీనిపై తక్షణమే స్పందించిన రాజస్థాన్ పోలీసులు, నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పబ్లిక్ రోడ్డుపై టూ-వీలర్‌పై వెళ్తున్న మహిళను, బైక్‌పై వచ్చిన వ్యక్తులలో ఒకరు అసభ్యంగా తాకినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరల్ ఫుటేజీని గమనించిన రాజస్థాన్ పోలీసులు, సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు నిర్ధారించారు. వైరల్ కంటెంట్ సృష్టించడం కోసం ప్రజల భద్రతకు ముప్పు కలిగించవద్దని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Next Story