ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం బుల్లెట్‌ ట్రైన్‌లపై దృష్టి పెట్టనుందా..?

Will Centre Focus on New Bullet Trains in Coming Years. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే దేశంలో బుల్లెట్‌ రైళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 26 Jan 2021 3:57 PM IST

Will Centre Focus on New Bullet Trains in Coming Years

ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌ అంటే ముందుకు గుర్తుకు వచ్చేది రైల్వే బడ్జెట్‌. ఈసారి రైల్వేబడ్జెట్‌ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత రెవెన్యూలో కీలక పాత్ర పోషించే రైల్వేలకు ఎలాంటి బడ్జెట్‌ కేటాయిస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌ కంటే ఈ సారి రైల్వేకు కేటాయింపులు బాగానే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 1.80 లక్షల కోట్లను రైల్వేకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని రైల్వే శాఖ కేంద్ర ఆర్థిక శాఖను కోరినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా ప్రభావంతో చాలా నష్టాలు వచ్చాయని రైల్వే శాఖ నుంచి వచ్చిన డిమాండ్‌ ఆచరణలో పెట్టడం అసాధ్యమని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న ఆర్థిక బడ్జెట్‌కు కేంద్రం రూ.1.77 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

ఇక నష్టాలను పూడ్చుకునేందుకు కేంద్ర సర్కార్‌ ప్రధానంగా ప్రైవేటు రైళ్లు నడపడంతో పాటు మరిన్నికొత్త రైళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీపై కూడా ఫోకస్‌ పెట్టనున్నట్లు సమాచారం. ఇక కిసాన్‌ రైలు రూట్లను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశంలో బుల్లెట్‌ రైళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కరోనా కారణంగా ఉభయ సభలు ఒక్కో షిప్టులలో సమావేశాలు జరగనున్నాయి. ముందుగా రాజ్యసభ సమావేశాలు జరుగుతుండగా, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి.


Next Story