'13వ తేదీన భారత పార్లమెంట్పై దాడి చేస్తా'.. ఉగ్రవాది బెదిరింపు
ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేసాడు.
By అంజి Published on 6 Dec 2023 12:26 PM IST
'13వ తేదీన భారత పార్లమెంట్పై దాడి చేస్తా'.. ఉగ్రవాది బెదిరింపు
ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేసాడు. అందులో డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని చెప్పాడు. డిసెంబర్ 13న 2001లో ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసి 22 ఏళ్లు నిండడం గమనార్హం. కాగా గురుపత్వంత్ సింగ్ని హత్య చేయడానికి కుట్రలు జరిగినటటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ' ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ ' (ఢిల్లీ ఖలిస్తాన్గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ను పట్టుకుని వీడియోలో కనిపించాడు పన్నూ.
తనను హత్య చేయడానికి భారత సంస్థలు చేసిన కుట్రలు విఫలమయ్యాయని అందులో పేర్కొన్నాడు. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్ 13కు ముందు పార్లమెంట్పై దాడి చేస్తానని తెలిపారు. పన్నూ బెదిరింపు వీడియో బయటకు రావడం వల్ల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో పన్నూన్ నుంచి బెదిరింపు వచ్చింది. డిసెంబర్ 22 వరకు సభ కొనసాగనుంది.
పన్నూన్ బెదిరింపు వీడియో బయటపడడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మూలాల ప్రకారం, భద్రతా ఏజన్సీల ప్రకారం, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI యొక్క K-2 (కశ్మీర్-ఖలిస్థాన్) డెస్క్ భారతదేశ వ్యతిరేక కథనాన్ని ప్రచారం చేసే వారి ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని పన్నన్కు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. గత నెల ది ఫైనాన్షియల్ టైమ్స్, పేరులేని మూలాలను ఉటంకిస్తూ, US అధికారులు పన్నన్ను చంపడానికి చేసిన కుట్రను విఫలం చేశారని పేర్కొంది.