సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్లో వెల్డన్ మోదీజీ.. అంటూ ప్రశంసించింది. మంచి పని చేశారు మోదీజీ.. మా సలహా పాటించారు. దేశ ప్రజల హితం కోసం రాహుల్, ప్రియాంక ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పనిచేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి. అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే పెద్దపీట వేశారు అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
వచ్చే నెల 4 నుంచి జరగాల్సిన పరీక్షలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, ఇతర సీనియర్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి పరీక్షల కోసం కొత్త తేదీలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.