ఉచిత సిలిండర్లకు బ‌దులు ఖాతాల్లోకి డ‌బ్బులు.. ఒక్కో సిలిండర్‌కు రూ.914.50

ఉజ్వల యోజనలో 1.75 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు

By Medi Samrat  Published on  19 Aug 2023 3:07 PM GMT
ఉచిత సిలిండర్లకు బ‌దులు ఖాతాల్లోకి డ‌బ్బులు.. ఒక్కో సిలిండర్‌కు రూ.914.50

ఉజ్వల యోజనలో 1.75 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇవ్వడానికి బదులుగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయాలని ఆలోచిస్తోంది. ఒక్కో సిలిండర్‌కు రూ.914.50 చెల్లిస్తారు. ఈ దీపావళికి ఖాతాకు మొదటి విడత పంపే ప్లాన్‌లో ఉంది. ఇందుకోసం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరనున్న‌ట్లు తెలుస్తోంది.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్వల పథకం కింద‌ లబ్ధిదారులకు రెండు ఉచిత సిలిండర్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వీటిని హోలీ, దీపావళికి ఇవ్వాలి. ఎన్నికల ఫలితాల తర్వాత రెండుసార్లు హోలీ, ఒకసారి దీపావళి గడిచిపోయింది. వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేప‌థ్యంలో ఈ హామీ అమలు సాధ్య‌ప‌డ‌లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం ఫార్ములాను పరిశీలిస్తోంది.

సిలిండర్ రిటైల్ సగటు ధర రూ.1,144లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.230 సబ్సిడీ, బ్యాంకు మారకపు రేటు మినహాయించి సుమారు రూ.914.50 చెల్లించేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకంలో లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story