కరుణానిధి మనవడా.. నీకిది తగునా..!

Udhayanidhi Stalin Sensational Comments On PM Modi. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  2 April 2021 11:28 AM GMT
Udhayanidhi Stalin

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పలువురు ప్రచారం చేస్తూ ఉన్నారు. కరుణానిధి మనవడు, డీఎంకే స్టార్ క్యాంపెయినర్ కూడా ప్రచారంలో చాలా బిజీ అయ్యారు. కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలే వివాదాస్పదం అయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ టార్చర్ కారణంగానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీపై విమర్శలు గుప్పిస్తూ పలువురు సీనియర్ నేతలను మోదీ పక్కన పెట్టారని విమర్శలు చేశారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ స్పందించారు. 'ఉదయనిధి జీ.. మీ ఎన్నికల క్యాంపెయిన్ కోసం మా అమ్మ పేరును వాడకండి.. మీరు చేసిన వ్యాఖ్యల్లో ఎంత మాత్రం నిజం లేదు. నరేంద్ర మోదీకి మా అమ్మ అంటే ఎంతో గౌరవం. మా కష్ట సమయాల్లో బీజేపీ అండగా ఉంది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధపెడుతూ ఉన్నాయి' అంటూ ట్వీట్ చేశారు. 'మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది' అని సుష్మ బన్సూరి స్వరాజ్‌ ట్వీట్‌లో పేర్కొంది.

ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్‌ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. 'ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్య రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా' అని సోనాలీ ట్వీట్‌ చేసింది. మాటకు ముందు తాను కరుణానిధి మనవడిని అని చెప్పుకునే ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.


Next Story