ఇద్దరు తీవ్రవాదులు హతం.. ఇంకా అక్కడ దాక్కునే ఉన్నారు..!
భద్రతా బలగాలు మరో ఇద్దరు తీవ్రవాదులను అంతమొందించాయి.
By Medi Samrat
భద్రతా బలగాలు మరో ఇద్దరు తీవ్రవాదులను అంతమొందించాయి. గురువారం సింగ్పోరా చత్రూలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రూలోని సింగ్పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. 'ఆపరేషన్ ట్రాషి' అనే కోడ్నేమ్తో సాగుతున్న ఈ ఉమ్మడి ఆపరేషన్లో కాల్పులు జరిగిన తర్వాత అదనపు దళాలను మోహరించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ Xలో ఒక పోస్ట్లో తెలిపింది.
సింగ్పోరా చత్రూలో రెండు పారా SF దళాలు, ఆర్మీకి చెందిన 11RR, 7వ అస్సాం రైఫిల్స్, SOG కిష్త్వార్ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ముగ్గురు నుండి నలుగురు ఉగ్రవాదుల బృందం చత్రూ అడవుల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు దళాలను మోహరించారు. ఎన్కౌంటర్ సైట్కు వెళ్లే అన్ని మార్గాలను సీజ్ చేశారు.