రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రముఖ కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యారు.
స్థానిక సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం ఫ్యాక్టరీలో పని జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. కెమికల్ డ్రమ్ములు ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో లోపల సుమారు 15 నుండి 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.