ఆయన కేవలం బస్ కండెక్టర్ మాత్రమే కాదు..!
TN bus conductor wins PM's praise. ఆయన ఒక బస్ కండెక్టర్.. బస్ లో టికెట్లు ఇవ్వడమే కాకుండా ప్రయాణీకులకు మొక్కలను ఇస్తూ ఉంటారు.
By - Medi Samrat |
ఆయన ఒక బస్ కండెక్టర్.. 34 సంవత్సరాలుగా కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తూనే చేస్తూ.. తన పని మాత్రమే చేసుకుంటూ బ్రతకడం లేదు. సమాజం కోసం.. రాబోయే తరాల కోసం కూడా సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన మరెవరో కాదు కోవై బస్ కండక్టర్ యోగనాథన్. సాధారణంగా ఆయన బస్ లో టికెట్లు ఇవ్వడమే కాకుండా ప్రయాణీకులకు మొక్కలను ఇస్తూ ఉంటారు. ఆ మొక్కలను పాతి పెట్టాలని.. అలాగే మొక్కలు, చెట్ల విలువ ఏమిటో కూడా చెబుతూ వస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ మంచి పని చేస్తూ వస్తున్నారు. ఈ విషయం భారత ప్రధాని నరేంద్ర మోదీ దాకా వెళ్ళింది. తాజాగా మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ యోగనాథన్ ను ప్రశంసించారు. మోదీ మాట్లాడుతూ కోవైలో బస్ కండక్టర్ యోగనాథన్ ప్రయాణికులకు టికెట్తోపాటు మొక్కలను అందజేస్తున్నారని, తన ఆదాయంలో అధిక భాగాన్ని ఇందుకోసం వినియోగిస్తుండడం ప్రశంసనీయమన్నారు.
తన గురించి మోదీ మాట్లాడడంపై యోగనాథన్ సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో యోగనాథన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందని, ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తనలా ఎందరో మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమవుతారన్నారు. తనకు వచ్చే ఆదాయంలో 40 శాతాన్ని మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నానని.. 34 ఏళ్లుగా కండక్టర్గా పనిచేస్తున్న తాను ఇంతవరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు తెలిపారు. గత ఏడాది 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆయన అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. యోగనాథన్ ఇప్పటి వరకు అనేక అవార్డులను అందుకున్నారు.