కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ప్రిస్కూల్లో మూడేళ్ల పసిపాపను శిక్ష పేరుతో ఒక అలమరలో బంధించారు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటన స్కూల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలైన బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సయితా కర్మాకర్, ఇందిరా దాస్ అనే ఇద్దరు టీచర్లు ఆ చిన్నారిని బలవంతంగా ఒక కప్బోర్డ్లో ఉంచారు. ఆమె బయటకు రాకుండా అడ్డంగా ఒక బరువైన టేబుల్ను ఉంచారు.
ఒక టీచర్ ఆ పాపను ఖాళీగా ఉన్న క్లాస్రూమ్లోకి లాక్కెళ్లడం, అక్కడ ఒక మూలన కూర్చోబెట్టి ఆ తర్వాత కప్బోర్డ్లోకి నెట్టడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. కలకత్తా యూనివర్శిటీ క్లినికల్ సైకాలజీ సెంటర్ నివేదిక ప్రకారం.. ఆ పాప తీవ్ర మానసిక వేదన , నిద్రలేమితో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె స్కూల్కు వెళ్లడానికి లేదా ఆ టీచర్లను చూడటానికి భయపడుతోంది.
విదేశాల్లో ఉండే పాప తండ్రి ఈ విషయం తెలిసిన వెంటనే కోల్కతాకు చేరుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన స్కూల్ యాజమాన్యం, బాధ్యులైన ఇద్దరు టీచర్లను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపింది. పోలీసులకు కూడా లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చామని తెలిపింది.