రాజస్థాన్లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోవడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పదకొండు మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు విద్యార్థులు ‘‘పైకప్పు నుంచి రాళ్లు రాలుతున్నాయని’’ ఉపాధ్యాయులను హెచ్చరించినప్పటికీ, వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం ఈ విషాదానికి ప్రధాన కారణమైంది.
ఓ విద్యార్థి మాట్లాడుతూ.."పై నుంచి రాళ్లు రాలుతున్నాయని మేము టీచర్లకు చెప్పాం. కానీ వారు మమ్మల్ని తిట్టి, తరగతి గదిలో కూర్చోమన్నారు. ఆ సమయంలో గోడ కూలిపోయి, పైకప్పు విద్యార్థులపై పడింది" అని ప్రమాదం నుంచి బయటపడిన ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒకరు కన్నీళ్లతో వివరించాడు. ఈ దారుణం జరిగిన సమయంలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులు ఉన్న ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు బయట బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఈ దుర్ఘటన తర్వాత ఝలావార్ జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ తక్షణమే స్పందించి ఐదుగురు ఉపాధ్యాయులు సహా విద్యా శాఖ అధికారులను నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు. "శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల్లో విద్యార్థులను కూర్చోబెట్టవద్దని జూన్లోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ ఘటనలో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశాం, దాని నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం" అని రాథోడ్ తెలిపారు.