62 ఏళ్ల తన భర్త మీద 3.5 కోట్ల ఇన్సూరెన్స్.. ప్లాన్ పక్కాగా వేసిన 57 ఏళ్ల భార్య.. కానీ..!

Woman murder hubby for insurance. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భార్య భర్తను చంపేయాలని భావించడం చాలా దారుణమైన విషయం.

By Medi Samrat  Published on  11 April 2021 10:10 AM GMT
Woman murder hubby

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎన్నో దారుణాలు జరుగుతూ ఉండడాన్ని మనం చూసే ఉంటాం. కానీ కట్టుకున్న భార్య భర్తను చంపేయాలని భావించడం చాలా దారుణమైన విషయం. 62 సంవత్సరాల భర్తను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం 57 సంవత్సరాల భార్య హతమార్చించి. మొదట ప్రమాదమని భావించారు.. కానీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పని అని తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. అది కూడా ఈ వయసులో ఆమె భర్తను చంపడానికి చేసిన ప్లాన్ అచ్చం సినిమా సీన్ ను తలపిస్తూ ఉంది.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన బంధువు సాయంతో 57 ఏళ్ల మహిళ తన 62 ఏళ్ల భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. హత్య ఆరోపణలపై పెరిమనల్లూర్ పోలీసులు వీరిద్దరిని శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడిని ఈరోడ్ జిల్లాలోని తుడుపతి నివాసి కె. రంగరాజ్ గా గుర్తించారు. రంగరాజ్ కు పవర్ లూమ్ యూనిట్ ఉంది. మార్చి 15 న రంగరాజ్ ఒక ప్రమాదంలో గాయపడడంతో అతన్ని చికిత్స కోసం కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ చేశారు. రంగరాజ్‌ను తీసుకుని అతడి భార్య జోతిమణి, సమీప బంధువు రాజా కలిసి వ్యాన్‌‌లో తుడుపతికి ప్రయాణాన్ని ప్రారంభించారు.

రాత్రి 11:30 గంటలకు పెరుమనల్లూర్ సమీపంలోని వలసుపాలయం చేరుకున్నప్పుడు రాజా వాహనాన్ని ఆపాడు. రాజా, జోతిమణి వాహనం నుంచి దిగి, వ్యాన్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఘటనలో రంగరాజ్‌ సజీవ దహనం అయ్యాడు.

శుక్రవారం తెల్లవారుజామున, రంగరాజ్ మరణం గురించి తిరుపూర్ గ్రామీణ పోలీసులకు తెలిసింది. మొదట ఇదొక యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాారు. దర్యాప్తు సమయంలో రాజా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రాగా.. రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో రాజా ఓ బంక్‌లో డబ్బాలో పెట్రోల్ నింపుకున్నట్లు తేలింది. సిసిటివి ఫుటేజీని పోలీసులు సేకరించి ఆయన్ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడే ఈ హత్య కోణం తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

రంగరాజ్ అనేక మంది నుంచి సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వాళ్ళు ఆ డబ్బు కోసం రంగరాజ్ భార్య జోతిమణిని ఇబ్బందులు పెట్టారు. అప్పటికే రంగరాజ్ రూ .3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలను తీసుకుని ఉండగా.. నామినీగా జోతిమణి పేరును నమోదు చేశాడు. అడ్డు తొలగించుకోవాలంటే రంగరాజ్ చావాలి. దీంతో బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే ప్లాన్ వేసింది. దీంతో జోతిమణి అతన్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. ఆమె బంధువు రాజాను కలిసి అతనికి రూ.50,000 అడ్వాన్స్‌గా ఇచ్చింది. రంగరాజ్‌ను చంపిన తర్వాత మరో రూ .1 లక్ష ఇస్తానని చెప్పింది. కానీ ఈ మర్డర్ ప్లాన్ లో కొన్ని క్లూలు పోలీసులకు దొరకడంతో అడ్డంగా దొరికిపోయారు. ఇక పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయగా.. మొత్తం కక్కేశారు.


Next Story