వీధి కుక్కల సమస్యపై విచారణ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది.
By - Knakam Karthik |
వీధి కుక్కల సమస్యపై విచారణ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా వాదనలు కేవలం కుక్కలకే పరిమితమవుతున్నాయంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇతర జంతువుల సంగతి ఏంటి? కోళ్లు, మేకలకు ప్రాణాలు లేవా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ సమయంలో ఓ పిటిషనర్, వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన 90 ఏళ్ల వృద్ధుడి ఫోటోను కోర్టుకు చూపించే ప్రయత్నం చేయగా, ధర్మాసనం అడ్డుకుంది. ఈ ఫోటో చూపాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది..మా ఆదేశాలు కేవలం ఇన్స్టిట్యూషనల్ ఏరియాలకే వర్తిస్తాయి, రోడ్లకు కాదు. పాఠశాలలు, ఆసుపత్రులు, కోర్టుల లోపల వీధి కుక్కలు ఎందుకు ఉండాలి? అవి అక్కడి నుంచి తొలగించడంపై అభ్యంతరం ఏమిటి?” అని ప్రశ్నించింది. వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధుల్లో సంచరించే కుక్కలు తరచూ వాహనాలకు అడ్డుపడి ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తుచేసింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. వీధుల్లో తిరిగే కుక్క కరుస్తుందని భావించినపుడు స్థానికులు అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. అధికారులు ఆ శునకాన్ని తీసుకువెళ్లి స్టెరిలైజ్ చేసి వదిలిపెడతారని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్టెరిలైజ్ చేశాక మనుషులను కరవకుండా వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పడం మర్చిపోయినట్టున్నారని వ్యాఖ్యానించింది. మనుషులను కరవడం మాత్రమే కాదు.. వీధుల్లో కుక్కలు పరిగెత్తడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ధర్మాసనం గుర్తు చేసింది.
ప్రమాదం జరిగాక చికిత్స తీసుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీధుల్లో, స్కూళ్లు, విద్యాసంస్థల చుట్టుపక్కల కుక్కలు సంచరించాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. వీధుల్లో సంచరించే ప్రతీ కుక్క మనుషులను కరవకపోవచ్చు కానీ రోడ్లపై అవి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం మాత్రం ఉందని ధర్మాసనం పేర్కొంది.