ఇలాంటి భాష రాయమని ఎవరు పురమాయించారు.?.. కుల గణనపై స్టే కోరిన పిటిషనర్‌ను మందలించిన సీజేఐ

By -  Medi Samrat
Published on : 10 April 2026 1:14 PM IST

ఇలాంటి భాష రాయమని ఎవరు పురమాయించారు.?.. కుల గణనపై స్టే కోరిన పిటిషనర్‌ను మందలించిన సీజేఐ

కుల గణనపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయబడింది. పిటిషనర్ ఉపయోగించిన భాష పట్ల సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. పిటిషన్‌లో ఉపయోగించిన భాష విషయంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పిటిషనర్‌ను మందలించారు. స్వయంగా హాజరైన పిటిషనర్‌తో సీజేఐ ఇలా అన్నారు, "మీరు మీ పిటిషన్‌లో దూషణా భాషను ఉపయోగించారు. మీరు మీ పిటిషన్‌లో అసభ్యకరమైన భాషను వాడారు. ఇంతటి దూషణా భాషను రాయమని మిమ్మల్ని ఎవరు పురమాయించారు?" అని ప్ర‌శ్నించారు.

సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. జస్టిస్‌లు జయమల్య బాగ్చి, విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ పిటిషన్ కుల గణనను వ్యతిరేకించడమే కాకుండా, ఒక్క బిడ్డ ఉన్న కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని కూడా కోరింది.

2027 సార్వత్రిక జనాభా లెక్కలలో పౌరుల కుల సమాచారాన్ని నమోదు చేయడం, వర్గీకరించడం, ధృవీకరించడం కోసం అనుసరించాల్సిన ప్రక్రియను ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ప్రత్యేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) విచారించడానికి ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు నిరాకరించింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2027 జనాభా లెక్కలు అధికారికంగా దేశానికి 16వ జాతీయ జనాభా లెక్కలు కానున్నాయి. అంతేకాకుండా, 1931 తర్వాత సమగ్ర కుల గణనను కూడా చేర్చిన మొట్టమొదటి జనాభా లెక్కలు ఇవే. ఇది దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా లెక్కలు కూడా కానుంది.

Next Story