ఆమె మీదే పార్టీ ఆశలు.. మార్చి 31న తొలిసారి రాజకీయ వేదికపైకి సునీతా కేజ్రీవాల్‌

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది.

By Medi Samrat  Published on  29 March 2024 9:42 AM GMT
ఆమె మీదే పార్టీ ఆశలు.. మార్చి 31న తొలిసారి రాజకీయ వేదికపైకి సునీతా కేజ్రీవాల్‌

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె రంగంలోకి దిగారు. ఈ నేప‌థ్యంలోనే మార్చి 31న ఆమె తొలిసారిగా రాజకీయ వేదికపై నుంచి ప్రసంగించనున్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే సునీతా కేజ్రీవాల్ గత కొద్ది రోజులుగా వేదికపై మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీ వ్యవహారాల్లో ఆమె చురుకుదనం పెరిగింది.

ఇప్ప‌టికే అరవింద్ కేజ్రీవాల్ సందేశంతో ఆమె రెండుసార్లు ప్రజల ముందుకు వచ్చారు. మార్చి 31న రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో ఆమె ప్రసంగం ఉంటుంది. 2011లో అన్నా ఉద్యమం ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌కి భారీ గుర్తింపు వచ్చింది.. ఈ రాంలీలా మైదాన్‌లోనే.

అరవింద్‌ కేజ్రీవాల్‌ లేకపోవడంతో సునీతా కేజ్రీవాల్ పార్టీని ఒక తాటిపై న‌డ‌ప‌డంలో ఆమె స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకపోవడంతో ఆమె క్రియాశీలతను పెంచాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యూహం సిద్ధం చేస్తోంది.

సీఎం అరెస్టును అంశంగా చేసుకుని ప్రజల నుంచి సానుభూతి పొందాలన్నది ఆ పార్టీ ప్లాన్. సునీతా కేజ్రీవాల్ ద్వారానే దీనిని మరింత మెరుగ్గా పెంచుకోవచ్చు. తన రాజకీయ క్రియాశీలతను పెంచుకుంటూ.. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పటి నుండి ఆమె మూడుసార్లు ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఇప్పుడు మార్చి 31వ తేదీన జరగనున్న మహారాలీకి ఆప్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

మూలాలను విశ్వసిస్తే.. సునీతా కేజ్రీవాల్‌ను రాజకీయంగా లాంచ్ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. ఈ వేదిక ద్వారా ఆమె ప్రజల సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. త‌ద్వారా ఆమె కేంద్రంపై విరుచుకుపడటంతో పాటు తన పార్టీ ఎజెండాను కూడా ప్రదర్శించనున్నారు. ఈ మెగా ర్యాలీ విజయం లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని ఆప్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

ఇండియా కూటమి బ్యానర్‌పై ఈ మెగా ర్యాలీ జరుగుతోంది. అయితే దీన్ని విజయవంతం చేసే బాధ్యతను ఆప్ ప్రధానంగా స్వీకరిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ED అరెస్టు చేసిన తర్వాతే ఈ ర్యాలీ జరుగుతోంది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ వ్యవహరించిన తీరులానే.. సునీతా కేజ్రీవాల్ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే వ్యూహంతో ఉన్నారు.

ఈ కేసులో ఇప్పటికే పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నేతలు జైలులో ఉండడంతో కార్యకర్తల మనోధైర్యం కూడా దెబ్బతింటోంది. త్వరలోనే జైలు నుంచి వస్తానని సీఎం చెబుతున్నా.. అంత తేలిగ్గా బెయిల్ దొరకద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా.. ఎంతకాలం ప్రభుత్వాన్ని నడపగలరనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నేప‌థ్యంలో సునీతా కేజ్రీవాల్‌పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది.

Next Story