సామాన్యుల నెత్తిపై పిడుగు.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు

Subsidy Cylinder Gas Price. సామాన్యుల నెత్తిపై మ‌రో పిడుగు పిడింది. ఓవైపు పెట్రోల్, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మోత మోగుతున్న

By Medi Samrat  Published on  2 Dec 2020 2:15 PM GMT
సామాన్యుల నెత్తిపై పిడుగు.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు

సామాన్యుల నెత్తిపై మ‌రో పిడుగు పిడింది. ఓవైపు పెట్రోల్, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మోత మోగుతున్న వేళ.. అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌ల‌కు అనుగుణంగా దేశంలో రాయితీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను భారీగా పెంచాయి చ‌మురు సంస్థ‌లు. ఒక్కో సబ్సిడీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధరలను అప్పుడప్పుడూ పెంచుతూ వచ్చిన కేంద్రం.. సామాన్యులు వినియోగించే సబ్సిడీ సిలిండర్ల ధరలను మాత్రం పెంచలేదు.

అయితే ఇప్పుడు ఒక్కో సబ్సిడీ సిలిండర్‌ పైన 50 రూపాయలు పెంచడంతో సామాన్యులపై భారం పడనుంది. ఈ పెంపుతో దేశ రాజ‌ధానిలో ప్ర‌స్తుతం రూ.594గా ఉన్న స‌బ్బిడీ సిలిండ‌ర్ ధర రూ.644కు పెరిగింది. హైదరాబాద్‌లో రూ.636.50 పైసలు ఉండ‌గా.. ఇప్పుడు 50 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర 686 రూపాయల 50 పైసలకు చేరుకోనుంది. ఆయా ప్రాంతాలను బట్టి ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు.

గృహ అవ‌స‌రాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం వంట‌గ్యాస్‌పై రాయితీ అందిస్తోంది. వినియోగ‌దారులు సంవ‌త్స‌రానికి 12 సిలిండ‌ర్ల వ‌ర‌కు రాయితీతో కొనుగోలు చేసుకోవ‌చ్చు. అంత‌కంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధ‌ర‌ల‌కు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ స‌బ్సీడి మొత్తాన్ని కేంద్రం నేరుగా వినియోగ‌దారుల బ్యాంకు ఖాతాల్లోకి బ‌దిలీ చేస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ గ్యాస్ ధరను పెంచడంతో పేద ప్రజలు, సామాన్యులు ఎవరైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో వారు అదనంగా డబ్బును వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెంచిన ధరను సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తుందా.. లేకుంటే వినియోగదారులపైనే భారం మోపుతుందా.. అనేది తెలియాల్సి ఉంది.


Next Story