దారుణం.. న‌డిరోడ్డుపై మ‌హిళ చీర లాగారు

SP leader accuses BJP workers of pulling woman's saree.ఎన్నిక‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి దేశంలో మ‌హిళ‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 6:51 AM GMT
దారుణం.. న‌డిరోడ్డుపై మ‌హిళ చీర లాగారు

ఎన్నిక‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి దేశంలో మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రిగే ఆకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ద‌మైన ఓ మ‌హిళ‌పై ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన వారు దాడికి పాల్ప‌డ్డారు. ఆమె చీర‌కొంగును సైతం లాగారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ మ‌హిళ చీర కొంగును లాగ‌డాన్ని ప‌లువురు నాయ‌కుల‌తో పాటు నెటీజ‌న్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు

వివ‌రాల్లోకి వెళితే.. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్‌ ఖేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదిస్తూ ఎస్పీ మ‌హిళా నాయ‌కురాలు నామినేషన్‌ సెంటర్‌లోకి వెళ్లాల్సి ఉంది. అయితే.. ప్ర‌త్య‌ర్థి పార్టీ చెందిన నాయ‌కులు ఆమెను న‌డిరోడ్డుపై అడ్డ‌గించారు. అంత‌టితో ఆగ‌కుండా చీర‌కొంగును లాగారు. నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కొని చింపేశారు. అక్కడే ఉన్న కొందరు ఆమెకు మద్ధతుగా రావడంతో వాళ్లు ఆగిపోయారు. ఈ త‌తంగాన్ని కొంద‌రు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. దాడికి పాల్ప‌డింది బీజేపీ నాయ‌కులేన‌ని అక్క‌డ ఉన్న ఎస్పీ కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యూపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ఇది చేసింది కచ్చితంగా బీజేపీ నేతలే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ పైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ఉన్న రక్షణ ఇది అంటూ నిప్పులు చెరిగారు. దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Next Story