కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించారు. అది కూడా రాయితీతో!!! ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు ఊరటనిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం రాయితీ పథకాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని జరిమానా చెల్లించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటిలో సీటు బెల్టు ధరించనందుకు ఆరుసార్లు, అతివేగం కారణంగా ఒకసారి చలానా విధించారు. ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా ఉన్నప్పటికీ చెల్లించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి, రాయితీ పథకం ద్వారా చలానా చెల్లించారు. రాయితీ మినహాయించి రూ. 8,750 చెల్లించారు. ట్రాఫిక్ చలానాల రాయితీ పథకాన్ని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ప్రభుత్వం ప్రకటించింది. జరిమానాకు గురైన వాహనదారులు 50 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని తెలిపింది.