స్టెరిలైట్ ప్లాంట్ ను తెరవండి.. రాజకీయాలు లేకుండా ఆక్సిజన్ తయారీకి వినియోగించండి
SC allows Vedanta to run Sterlite plant for oxygen production.ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ను నాలుగు నెలల పాటు తాత్కాలికంగా తెరవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి
By Medi Samrat Published on 27 April 2021 3:45 PM IST
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ కోసం పలు సంస్థలను ఆశ్రయిస్తూ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ ను తయారు చేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతుండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. దేశంలోని స్టీల్ ప్లాంట్ల నుంచి కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అయినప్పటికీ ఆక్సిజన్ సరిపోక పోవడం లేదు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ను నాలుగు నెలల పాటు తాత్కాలికంగా తెరవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే జరగాలని ఇతర కార్యకలాపాలేవీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కమిటీ దీని పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది. కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో స్టెరిలైట్ ఇండస్ట్రియల్ ప్లాంట్ను తమిళనాడు ప్రభుత్వం 2018లో మూసివేసింది. తమిళనాడులో ఒకరోజు ఆక్సిజన్ వినియోగం 350 ఎంటీలకు చేరిందని, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆక్సిజన్ ఉత్పత్తి రోజుకూ 400 ఎంటీల కంటే ఎక్కువే ఉండాలని అధికారులు అంచనా వేశారు. తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా వెంటనే నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు.
ఇక మంగళవారం నాడు సుప్రీం కోర్టు కూడా కీలక తీర్పును ఇచ్చింది. ఆక్సిజన్ తయారీ కోసం వేదాంతకు అనుమతులు ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. దీనిపై ఎటువంటి రాజకీయాలు కూడా ఉండకూడదని చెబుతూ ఉన్నారు. దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని.. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ ప్లాంట్ లో ఆక్సిజన్ తయారీని చూసుకోడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది. ఈ నిర్ణయంతో ప్లాంట్ కు నాలుగు నెలలపాటూ కరెంట్ సప్లై ఇవ్వడానికి అధికారులు అంగీకరించారు.