అంతరిక్షంలోకి మోదీ, భగవద్గీత ఫోటో..!
Satish Dhawan nanosatellite to carry Bhagavad Gita, PM Modi's photo to space. ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు నింగిలోకి ఓ శాటిలైట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో పాటు భగవద్గీతను
By Medi Samrat
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంటూ వెళుతోంది. సైకిల్ మీద శాటిలైట్ మోసుకుని వెళ్లడంతో మొదలైన ఇస్రో ప్రస్థానం.. భారతదేశం గర్వించదగ్గ స్థానానికి చేరుకుంది. తక్కువ ఖర్చుతో ఎన్నో అద్భుతాలు సృష్టించడం కూడా భారత్ కే చెందింది. ఇస్రో ను స్థాపించి ఐదు దశాబ్దాలు అయిన సమయంలో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు నింగిలోకి ఓ శాటిలైట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో పాటు భగవద్గీతను, మరో 25 వేల మంది పౌరుల పేర్లను పంపాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారు మాత్రమే కాకుండా.. అవార్డులను అందుకున్న వారు కూడా ఉన్నారని తెలిపారు.
ఈ నెల 28న పీఎస్ఎల్వీ సీ-51 ను ప్రయోగించనున్న ఇస్రో, దాని ద్వారా అమెజానియా-1తో పిటు ఇండియన్ ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన ఆనంద్, యునిటీశాట్, సతీశ్ ధావన్ ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపనుంది. ఆనంద్ ను కర్ణాటకకు చెందిన స్టార్టప్ కంపెనీ 'పిక్సెల్' దీన్ని తయారు చేసింది. దీనితో పాటే సతీశ్ ధావన్ పేరిట తయారైన ఉపగ్రహాన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. వీటితో కోయంబత్తూరు కాలేజీ విద్యార్థులు తయారు చేసిన శ్రీశక్తి శాట్ం నాగపూర్ సైంటిస్టులు తయారు చేసిన జీహెచ్ఆర్సీఈ శాట్ తదితరాలు కూడా తమ తమ కక్ష్యల్లోకి వెళ్లనున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఫోటోను స్పేస్ లోకి పంపించనున్నామని స్పేస్ కిడ్జి ప్రకటించింది. మోదీ పేరు, దాని కింద ఆత్మ నిర్భర్ భారత్ పదాలు, భగవద్గీత ప్రతి, 25 వేల మంది పేర్లను పంపనున్నామని సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు. స్పేస్ లోకి పంపేందుకు పేర్లు కావాలని అడుగగా, విశేష స్పందన వచ్చిందని, 1000 మంది విదేశీయులు, చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థులందరి పేర్లతో సహా 25 వేల ఎంట్రీలు వచ్చాయని, వాటన్నింటినీ స్పేస్ లోకి పంపనున్నామని కేసన్ తెలిపారు. ఈ రాకెట్ 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ-51 వాహక నౌక ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.