నో బెయిల్..గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటికి షాక్ ఇచ్చిన కోర్టు

బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యా రావుకు ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో చుక్కెదురైంది.

By Knakam Karthik  Published on  14 March 2025 9:35 PM IST
National News, Actor Ranyaraos, Karnataka, Gold Smuggling Case

నో బెయిల్..గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటికి షాక్ ఇచ్చిన కోర్టు

బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రముఖ కన్నడ నటి రన్యా రావుకు ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో రెండో నిందితుడు తరుణ్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారించనుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చేసిన విచారణలో రన్యా రావు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె చెప్పినట్లుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ కేసులో కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి స్మగ్లింగ్ దందాను నడిపిస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించి, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఎవరికైనా సీబీఐ సమన్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యా రావుకు బెయిల్ నిరాకరించిన ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు, ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంది. జడ్జి విశ్వనాథ్ సి గౌడర్ అధ్యక్షతన ఉన్న కోర్టు, రన్యా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలనే ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరణ తర్వాత, రన్యా న్యాయ బృందం ఉపశమనం కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతోంది. ఆమె బెయిల్ దరఖాస్తుపై తీర్పు వెలువడే వరకు, ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటుంది.

రూ. 12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యా రావును మార్చి 4, 2025న అరెస్టు చేశారు. కన్నడ మూవీ ఇండస్ట్రీకి చెందిన రన్యా రావు దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రత్యేకంగా రూపొందించిన నడుము బెల్టులో దాచిపెట్టిన బంగారాన్ని కనుగొంది. ఆ తర్వాత ఆమె బెంగళూరు నివాసంలో జరిపిన సోదాల్లో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం జప్తు చేసిన ఆస్తులు రూ.17.29 కోట్లకు చేరుకున్నాయి.

Next Story