Rajasthan BJP Manifesto: సిలిండర్‌పై రూ.450 రాయితీ.. విద్యార్థినులకు స్కూటీ ఫ్రీ

జస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 11:02 AM GMT
rajasthan, elections, bjp, manifesto, jp nadda,

 Rajasthan BJP Manifesto: సిలిండర్‌పై రూ.450 రాయితీ.. విద్యార్థినులకు స్కూటీ ఫ్రీ  

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో కూడా అసెంబ్లీ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, పేపర్‌ లీకులకు పేరు పొందింది అన్నారు. ఈ క్రమంలోనే 'సంకల్ప్‌ పాత్ర' పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను జైపూర్‌లో విడుదల చేశారు.

రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే పేపర్‌ లీకులు, అనేక పథకాల్లో అవినీతిపై విచారణ కోసం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా చెప్పారు. అలాగే ప్రతి జిల్లాకు ఒక మహిళా పోలీస్‌ స్టేషన్, ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా డెస్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమైన పట్టణాల్లో యాంటీ రోమియో స్క్వాడ్‌లను నియమిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఆడపిల్ల పుడితే రూ.2 లక్షల పొదుపు బాండ్‌ను జమ చేస్తామన్నారు. అలాగే రాజస్థాన్‌లో గెలుపు కోసం బీజేపీ పలు హామీలను ప్రకటించింది.

* బీజేపీ మేనిఫెస్టోలోని పలు కీలక హామీలు

- పీఎం కిసాన్‌ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.12వేలకు పెంపు

- గ్యాస్ సిలిండర్‌పై రూ.450 చొప్పున రాయితీ ప్రకటన

- వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన

- 15వేల వైద్యుల నియామకం

- 12వ తరగతి పాసైన ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీ పంపిణీ

ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్ని తిరగరాయాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. అవినీతి, కుంభకోణాల పేరిట అధికార కాంగ్రెస్‌ను భాజపా లక్ష్యంగా చేసుకుంది.

Next Story