రాహుల్ గాంధీ, కమల్ నాథ్ లపై బాంబు దాడులు చేస్తామంటూ లేఖ

Rahul Gandhi Gets Bomb Threat Letter As Bharat Jodo Yatra Reaches Indore. భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో ఓ బెదిరింపు లేఖ వచ్చింది.

By Medi Samrat  Published on  18 Nov 2022 10:33 AM GMT
రాహుల్ గాంధీ, కమల్ నాథ్ లపై బాంబు దాడులు చేస్తామంటూ లేఖ

భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో ఓ బెదిరింపు లేఖ వచ్చింది. రాహుల్ పాదయాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ చేరుకుంది. భారత్ జోడో యాత్ర జుని ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే రాహుల్ పై బాంబు దాడి చేస్తామంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీట్ షాపు వద్ద ఓ లేఖ వదిలి వెళ్లారు. రాహుల్ యాత్ర ఇండోర్ చోరుకోగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని ఆ లేఖలో హెచ్చరించారు. రాహుల్ గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా హతమార్చుతామంటూ చెప్పారు. ఇది ఎవరో ఆకతాయిల పని అయ్యుంటుందని భావిస్తున్నప్పటికీ, ముందుజాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్వీట్ షాపు వద్ద లేఖ వదిలి వెళ్లిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజిని సేకరిస్తున్నారు.

బెదిరింపు లేఖ దృష్ట్యా, లేఖ మూలాన్ని కనుగొనడానికి స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని, ఇది బూటకపు బెదిరింపుగా అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇండోర్ పోలీసు కమిషనర్ హెచ్‌సి మిశ్రా మాట్లాడుతూ.. నగరంలోని జూని ప్రాంతంలోని ఒక స్వీట్ దుకాణానికి గురువారం సాయంత్రం ఒక లేఖ వచ్చిందని తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 507 (తెలియని వ్యక్తి ద్వారా నేరపూరిత బెదిరింపు) కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి నీలాభ్ శుక్లా లేఖపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారత్ జోడో యాత్రకు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్న పాదయాత్ర నవంబర్ 20న మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది.


Next Story