కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కర్ణాటకలో తమ పార్టీ తరుపున ప్రచారం చేశారు. కర్ణాటకలోని పులికేశి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేష్ రాథోడ్కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన సంప్రదాయ డ్రమ్స్ వాయిస్తూ కనిపించారు. తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కర్నాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 200 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ 168 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ హోదాను పొందడం పార్టీకి పెద్ద విజయం. దీంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ యోచిస్తోంది. మే 10న కర్ణాటకలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.