ప్రియుడి కోసం భారత్‌కు విదేశీ మహిళ.. ఏకంగా కుమార్తెతోనే..

ప్రియుడి కోసం ఆ మహిళ ఖండంతరాలు దాటి భారత్‌కు వచ్చింది. తన ఆరేళ్ల కూతురితో కలిసి ఆ మహిళ పోలండ్‌ నుండి భారత్‌లోని జార్ఖండ్‌ చేరుకుంది.

By అంజి  Published on  20 July 2023 2:18 AM GMT
Poland Woma, India, Social Media Friend, Jharkhand

ప్రియుడి కోసం భారత్‌కు విదేశీ మహిళ.. ఏకంగా కుమార్తెతోనే..

ప్రియుడి కోసం ఆ మహిళ ఖండంతరాలు దాటి భారత్‌కు వచ్చింది. తన ఆరేళ్ల కూతురితో కలిసి ఆ మహిళ పోలండ్‌ నుండి భారత్‌లోని జార్ఖండ్‌ చేరుకుంది. ప్రియుడిని కలిసిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొలండ్‌కు చెందిన పోలాక్‌ బార్బరా (45)కు జార్ఖండ్‌లోని హజరీబాగ్‌ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదాబ్‌ (35).. 2021వ సంవత్సరంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం తర్వాత మాటలు ఆ తర్వాత మనసులు కలిశాయి. ఇద్దరు ఆన్‌లైన్‌లో ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే పోలాక్‌కు ఇప్పటికే పెళ్లి కాగా.. ఆరు ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది.

కొన్ని రోజుల కిందట హజారీబాగ్‌ చేరుకున్న ఆ మహిళ.. తన ప్రియుడు షాదాబ్‌ని కలిసింది. ప్రస్తుతం హజారీబాగ్‌లోనే తన ప్రియుడితో కలిసి ఉంటోంది. పోలాక్‌.. జార్ఖండ్‌ వేడికి తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె కోసం షాదాబ్‌ వెంటనే ఏసీని ఏర్పాటు చేసి ఆమె పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. భారత్‌ చాలా అందమైన దేశమని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ గలవారని, తనను చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారని పోలాక్‌ చెప్పింది. విదేశీ మహిళ హజారీబాగ్‌కు వచ్చిందన్న విషయం తెలుసుకున్న డీఎస్పీ రాజీవ్‌ కుమార్‌ ఖుత్రా గ్రామానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. తాను పోలాక్‌తో మాట్లాడానని, మరికొద్ది రోజుల్లో పోలండ్‌ వెళ్లిపోతానని చెప్పిందని డీఎస్పీ చెప్పారు. షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలండ్‌ తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

Next Story