జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ వంతెనను ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర రైల్వే నెట్వర్క్తో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు రూ.35,000 కోట్ల వ్యయంతో నిర్మితమై, భారత రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. కాగా ప్రధాని మోడీ ఇవాళ జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తారు. ఈ సందర్శనలో ఆయన ఉదయం 11 గంటలకు చీనాబ్ వంతెన డెక్ను సందర్శించి, దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత, భారతదేశంలోనే మొదటి కేబుల్-స్టేయ్డ్ రైల్వే వంతెన అయిన అంజీ ఖాద్ వంతెనను కూడా ప్రారంభిస్తారు.
రైల్వే బ్రిడ్జి ప్రత్యేకతలు..
బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన ఈ వంతెన నిర్మాణం ఓ ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పటం అతిశయోక్తి కాదు. 2003లో వాజ్పేయి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలపగా.. ఇది పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది. భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏళ్లు. ఆర్చ్ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఎక్కువ. నదీ గర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది.