'యాస్‌' ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని మోదీ పర్యటన

PM Modi aerial survey of affected areas in Bengal and Odisha today.యాస్ తుఫాను కార‌ణంగా ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీగా న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో ఏరియ‌ల్ స‌ర్వే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 4:39 AM GMT
PM Modi aerial survey

యాస్ తుఫాను కార‌ణంగా ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీగా న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ఎంత మేర న‌ష్టం వాటిల్లింది అనేది ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించ‌నున్నారు. యాస్ తుఫాను వల్ల రాష్ట్రాలలో ఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికి గాను నిర్వహించే సమీక్ష సమావేశాలకు మోదీ అధ్యక్షత వహిస్తారు. బెంగాల్ లో నిర్వహించే సమీక్షా సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. కాగా.. తుఫాను ప్రభావం అధికంగా పడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మొదట ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్‌, భద్రక్‌ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్‌లోని పశ్చిమ మేదీనిపూర్‌ జిల్లాలోని కలైకుండకు చేరుకుంటారు. సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మమత, సీఎస్‌ బండియోపాధ్యాయతో కలిసి పూర్బా మేదినీపూర్‌, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.

యాస్ తుపాను కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వీరందరికీ తిండి, ఆవాస ఏర్పాట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నాయి. ఈ పునరావాస కార్యక్రమాల గురించి కూడా మోదీ ఇవాళ సమీక్ష చేయనున్నారు.


Next Story