కేరళ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటముల ప్రత్యామ్నాయ పాలనకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం కొచ్చిలో జరిగిన ఎన్డీయే (NDA) సభలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా సాగుతున్న ఈ రెండు కూటముల పాలన అవినీతికి నిలయంగా మారి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందని విమర్శించారు. కేరళ సాంస్కృతిక గుర్తింపును గౌరవిస్తూ అధికారికంగా 'కేరళం' అని పిలిచేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని ఆయన గుర్తుచేశారు.
యూడీఎఫ్ను 'ముస్లిం లీగ్, మావోయిస్ట్, కాంగ్రెస్' (MMC) కలయికగా అభివర్ణించిన ప్రధాని, ఇది చాలా ప్రమాదకరమైన కూటమి అని హెచ్చరించారు. రాష్ట్రంలో 'డబుల్ ఇంజిన్ సర్కార్' వస్తే పర్యాటకం, ఐటీ రంగాల్లో కేరళ గ్లోబల్ హబ్గా మారుతుందని, కేరళ తీర ప్రాంత అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న మలయాళీల భద్రతపై భరోసా ఇస్తూనే, ప్రతిపక్షాల కుట్రలను ఛేదించి కేరళలో ఎన్డీయే ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ధీమాను మోదీ వ్యక్తం చేశారు. కేరళ పర్యటన ముగించుకుని ఆయన తమిళనాడుకు బయలుదేరారు.