ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మావోయిస్టులపై అద్భుత విజయాన్ని సాధించిన భద్రతా బలగాలను అభినందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు, వారిలో బసవరాజు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని అమిత్ షా తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నాడని అనేక కథనాలు వచ్చాయి, అమిత్ షా చేసిన ప్రకటనతో ఆయన మృతి విషయం నిర్ధారణ అయింది. బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.