Video : భారత్‌పై విషం చిమ్మిన పాక్‌ మాజీ క్రికెటర్‌కు ఘన స్వాగతం.. ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదానికి కార‌ణ‌మ‌య్యాడు.

By Medi Samrat
Published on : 31 May 2025 2:31 PM IST

Video : భారత్‌పై విషం చిమ్మిన పాక్‌ మాజీ క్రికెటర్‌కు ఘన స్వాగతం.. ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదానికి కార‌ణ‌మ‌య్యాడు. పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత, ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తర్వాత, షాహిద్ అఫ్రిది భారత్‌, భారత సైన్యంపై చాలా అభ్యంతరకరమైన, విషపూరితమైన వ్యాఖ్య‌లు చేశాడు. ఈ వ్యాఖ్య‌లపై యావత్ భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్రిదీపై భారతీయులలో విపరీతమైన ఆగ్రహం కనిపించింది. ఇదిలావుండ‌గా.. అఫ్రిది గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో ఈ కోపానికి మరింత ఆజ్యం పోసింది.

భారత్‌ను తిట్టిన, ఇండియన్ ఆర్మీపై ప్రశ్నలు లేవనెత్తిన షాహిద్ అఫ్రిదీకి దుబాయ్‌లో కేరళ ప్రజలు ఘన స్వాగతం పలికారు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళ కమిటీకి సంబంధించిన వ్యక్తులు అఫ్రిదీకి ఘనస్వాగతం పలికారు. వైరల్ అవుతున్న వీడియోలు, చిత్రాలలో.. అఫ్రిదీకి 'బూమ్ బూమ్' నినాదాలతో స్వాగతం పలికి గౌరవం ఇవ్వడం చూడవచ్చు. అఫ్రిదీ గతంలో చేసిన ప్రకటనలను భారత ప్రజలు మరిచిపోని తరుణంలో ఈ స్వాగతం లభించింది. అతడి ప్రకటనలు భారత్‌కు వ్యతిరేకంగా.. రెచ్చగొట్టేవిగా ఉంటాయి.

ఇటువంటి పరిస్థితితుల‌లో దుబాయ్‌లోని కేరళ కమిటీ ఆయనకు ఈ విధంగా స్వాగతం పలకడంపై ప్రశ్నలు తలెత్తాయి. భారత్‌పై విషం చిమ్మిన వ్యక్తిని ఇలా సన్మానించడం సరికాదు అని ప్రజలు అడుగుతున్నారు. దీంతో ఈ వేడుక పెద్ద వివాదంగా మారింది. కేరళ కమిటీ ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అఫ్రిది భారత వ్యతిరేక ప్రకటనలు కేరళ కమిటీకి తెలియదా అని ప్రజలు కోపంగా అడుగుతున్నారు. భారత భద్రతా బలగాలపై వ్యాఖ్యానించిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గౌరవించారా? అని వ్య‌క్తం చేస్తున్నారు.

వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ సింగ్ షియోరాన్ ట్విట్టర్‌లో షాహిద్ అఫ్రిది ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ భారత్‌ను, భారత సాయుధ దళాలను విమర్శించాడని, అప్పుడు దుబాయ్‌లోని కేరళ సమాజం అతనికి స్వాగతం పలుకుతుందని రాశారు. నేను సిగ్గుతో తలవంచుకుంటున్నాను.. నా రక్తం మరుగుతుంది.. సరిహద్దులో ఉన్న సైనికుడు ఇది చూసినప్పుడు ఏమనుకుంటాడు.? అతడు భారతదేశానికి అతిపెద్ద శత్రువు.. సిగ్గుగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు.

పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన జరిగిన వెంటనే షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ టెలివిజన్‌లో కనిపించి భారత భద్రతా దళాలను ప్రశ్నిస్తూ విషపూరిత ప్రకటన ఇచ్చాడు. కాశ్మీర్‌లో మీ వద్ద కేవలం 8 లక్షల సైన్యం ఉంది.. ఇది జరిగింది అంటే మీరు విలువ లేనివారు, పనికిరానివారు, ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని వ్యాఖ్యానించాడు.

Next Story