లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం సభలో తీవ్ర చర్చ జరిగింది. స్పీకర్ అధికార పక్షం పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, కె. సురేష్, మల్లు రవిలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అయితే, ఈ తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఎవరు ఉండాలనే అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ నియమించిన ప్యానల్ ఛైర్మన్ జగదాంబికా పాల్ అధ్యక్షత వహించడాన్ని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టగా, నిబంధనల ప్రకారం ఆయనకు ఆ అర్హత ఉందని కిరణ్ రిజిజు, నిషికాంత్ దూబే కౌంటర్ ఇచ్చారు. చివరికి 50 మందికి పైగా ఎంపీలు మద్దతు తెలపడంతో తీర్మానాన్ని చర్చకు స్వీకరించారు. దీనిపై చర్చించేందుకు 10 గంటల సమయాన్ని కేటాయించగా, కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.