ఉత్తరాఖండ్ అడవిలో మళ్లీ కార్చిచ్చు
forest fire in new Tehri. ఉత్తరాఖండ్ అడవిలో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది.
By Medi Samrat
ఉత్తరాఖండ్ అడవిలో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. న్యూతెహ్రీ జిల్లా బుడోగి ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపకసిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మంటలను అదుపులోకి వచ్చిన తరువాత నష్టాన్ని అంచనా వేస్తామన్నారు అటవీ శాఖ అధికారులు . స్థానిక ప్రజలెవ్వరూ అటవీ ప్రాంతంలో చిన్న నిప్పు కూడా పడేయొద్దని కోరారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఎవరైనా వ్యక్తులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఉత్తరాఖండ్ అడవుల్లో రేగిన కార్చిచ్చులు ఆందోళనకరంగా మారాయి. నైనిటాల్, తెహ్రీ, అల్మోరా, పౌరీ తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో రాజుకున్న మంటలకు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు, కొన్ని అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు కనీసం 12వేల మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 'జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)' బృందాలు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు ప్రారంభించాయి. సాధారణంగా వేసవిలో సంభవించే దావానలాలు... ఉత్తరాఖండ్లో ఈ ఏడాది శీతాకాలం నుంచే మొదలయ్యాయి. అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంవల్ల పెరిగిన ఉష్ణోగ్రతలే ఈ ప్రమాదాలకు కారణమని భావిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటికే కొంతమంది ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి సమయం లో కార్చిచ్చు పొగ మరింత ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో కార్చిచ్చు ఏర్పాడటానికి గల కారణాలపై కూడా ద్రుష్టి పెట్టారు.