నవంబర్ 15 మధ్యాహ్నం 12:30కు మీటింగ్.. అప్పుడే సీఎం ఎవరో తెలుస్తుంది: నితీష్

NDA Meeting On Sunday To Elect Leader. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా కొనసాగిన జనతా

By Medi Samrat  Published on  13 Nov 2020 9:58 AM GMT
నవంబర్ 15 మధ్యాహ్నం 12:30కు మీటింగ్.. అప్పుడే సీఎం ఎవరో తెలుస్తుంది: నితీష్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా కొనసాగిన జనతా దళ్ యునైటెడ్ ఛీఫ్ నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా.. లేదా..? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఆదివారం మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకూ ఆగాల్సిందే అని నితీష్ కుమార్ చెబుతూ ఉన్నారు. ఆదివారం నాడు ఎన్డీయే మిత్ర పక్షాల మీటింగ్ ఉందని.. అప్పుడే ముఖ్యమంత్రి ఎవరో తెలుస్తుందని నితీష్ కుమార్ శుక్రవారం నాడు చెప్పుకొచ్చారు.

ఈ సమావేశంలో ఎన్నో విషయాల గురించి చర్చిస్తామని.. వాటన్నిటినీ తర్వాత వెల్లడిస్తామని అన్నారు. ఎవరు సీఎం కావాలనే విషయాన్ని ఎన్డీయే నిర్ణయిస్తుందని చెప్పారు. లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విషయంలో కూడా ఎన్డీయేనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎల్జేపీ కేవలం ఒక సీటును మాత్రమే గెలిచినప్పటికీ.. జేడీయూ ఓట్లను పెద్ద సంఖ్యలో చీల్చిందని నితీశ్ అన్నారు. ఈ ఓట్ల చీలిక వల్ల జేడీయూ దాదాపు 30 స్థానాలను కోల్పోయిందని అన్నారు.

బిహార్ ఎన్నికల్లో 243 సీట్లకు బీజేపీ 74 సీట్లలో గెలవగా, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకు పరిమితమైంది. ఇతర ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించింది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీలు 125 స్థానాలను సాధించాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో 122 మేజిక్ ఫిగర్ కాగా, దానికి మూడు సీట్లను మాత్రమే అధికంగా సంపాదించింది. మహా ఘటబంధన్ 110 సీట్లను దక్కించుకుంది.


Next Story