26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ హుస్సేన్ రాణా జ్యుడీషియల్ కస్టడీని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టు బుధవారం ఆగస్టు 13 వరకు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో దర్యాప్తు సంస్థ బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జీత్ సింగ్ ముందు తహవుర్ను హాజరుపరిచింది. దీంతో కోర్టు కస్టడీని పొడిగించింది.
తహవుర్ హుస్సేన్ రాణా 26/11 ప్రధాన కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి అత్యంత సన్నిహితుడు, అమెరికా పౌరుడు. అతనిని భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన రివ్యూ పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న కొట్టివేసిన తర్వాత ఆయనను భారత్కు తీసుకొచ్చారు.
నవంబర్ 26, 2008న, 10 మంది పాకిస్తానీ టెర్రరిస్టుల బృందం సముద్ర మార్గం గుండా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలోకి చొరబడిన తర్వాత రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హోటళ్లు, యూదుల కేంద్రంపై సమన్వయంతో దాడి చేసి విధ్వంసానికి దిగింది. దాదాపు 60 గంటలపాటు జరిగిన ఈ దాడిలో 166 మంది చనిపోయారు.