తన గురువు, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.ఎం.శర్మకు హృదయపూర్వక నివాళిగా, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తాను చదువుకున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసిటి) ముంబైకి 151 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని తెలిపారు. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు.
ముఖేశ్ అంబానీ 1970వ సంవత్సరంలో ఐసీటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)గా పిలిచేవారన్నారు. యూడీసీటీలో తన విద్యార్థి దశ జ్ఞాపకాలను, ప్రొఫెసర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు ముఖేష్ అంబానీ. ప్రొఫెసర్ శర్మను "రాష్ట్ర గురువు", "భారత గురువు"గా అభివర్ణించిన అంబానీ, భారతదేశ రసాయన పరిశ్రమకు పునాది వేసి, తరతరాలుగా శాస్త్రీయ ప్రతిభను పెంపొందించడంలో ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.