వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును ఈ ఏడాది జూన్ వరకు పెంచుతున్నట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండటంతో వాహనదారులకు ఊరట లబించినట్టయింది. మోటార్ వెహికిల్స్ చట్టం 1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం అవసరమైన పత్రాల చెల్లుబాటు గడువును పొడిగించినట్టు పేర్కొంది. ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య చెల్లుబాటు గడువు ముగిసిన వాటికి ఇది వర్తించనుంది.
ప్రస్తుత ప్రకటనతో.. ఫిబ్రవరి 1, 2020 తర్వాత గడువు ముగిసిన పత్రాలను.. జూన్ 30, 2021 వరకు చెల్లుబాటులో ఉన్నట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ మేరకు కేంద్రం.. రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలని పేర్కొంది. ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజస్ట్రేషన్తోపాటు ఇతర ధ్రువీకరణ ప్రతాలకు ఇది వర్తిస్తుంది.
ఇదిలావుంటే.. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటు కాలన్ని గడిచిన సంవత్సరంలోనే జూన్ 9, 2020 వరకు పెంచింది. ఆ తర్వాత ఆగస్టు 9, 2020కి, ఆపై డిసెంబరు 27, 2020కి పొడిగించింది. అనంతరం 2021 పిబ్రవరి 1కి, ఆపై మార్చి 31కి పెంచింది. అయితే మరో రెండు రోజుల్లో ఆ గడువు ముగియనుండగా.. జూన్ 30, 2021 పెంచుతున్నట్టు ప్రకటించింది.