ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉగ్రవాదిని వీడియో కాల్ లో అతని తల్లి లొంగిపోవాలని వేడుకుంది. ఎంత వేడుకున్నా అతడు తల్లి మాట వినలేదు. ఉగ్రవాది అమీర్ నజీర్ వాని తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు చేతిలో AK-47 పట్టుకుని కనిపించాడు. చివరి వీడియో కాల్లో, అమీర్ ను అతడి తల్లి లొంగిపోవాలని చెప్పింది, కానీ అతను నిరాకరించాడు. "సైన్యం ముందుకు రానివ్వండి, అది నేను చూస్తాను" అని అతను బదులిచ్చాడు.
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాదులలో అమీర్ కూడా ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు, వీరందరూ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా నివాసితులు.
కాల్పులు జరగడానికి ముందు అమీర్ వారు దాక్కున్న ఇంటి నుండే వీడియో కాల్ చేశారు. అమీర్ తల్లి, అతని సోదరి వీడియో కాల్లో అతనితో మాట్లాడారు. అతను ఆసిఫ్ సోదరితో కూడా మాట్లాడాడు, ఆమె తన సోదరుడి గురించి ఆరా తీసింది. భద్రతా దళాలు ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరాయి, కానీ లొంగిపోయే బదులు వారు జవాన్లపై కాల్పులు జరిపారు.