పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.
By Knakam Karthik
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని విపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం వెల్లడించిన ప్రకారం,జూలై 21 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
ఈ 23 రోజుల సమావేశాల్లో పహల్గాం దాడి తర్వాత సాగించిన ఆపరేషన్ సిందూర్పై చర్చకు అవకాశం ఉండనున్నట్లు సమాచారం. అంతేకాకుండా,ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. జాతీయ భద్రత,ఆర్థిక పరిపాలన అంశాలపై కూడా చర్చలు సాగే అవకాశముంది.
కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో విధానపరమైన అంశాలు, పెండింగ్లో ఉన్న చట్టాలు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.