హెచ్చరిక.. త్వరలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం..?

Massive earthquake to hit Himachal Pradesh and Uttarakhand soon.దేశంలోని హిమాలయప్రాంతాన్ని భారీ భూకంపం వణికించవ‌చ్చున‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 6:21 AM GMT
హెచ్చరిక.. త్వరలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం..?

ఇటీవ‌ల ట‌ర్కీ, సిరియా దేశాల్లో సంభ‌వించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఆ దేశాలు చిగురుటాకుల వ‌ణికిపోయాయి. రెండు దేశాల్లో క‌లిపి 47 వేల మందికి పైగా ప్ర‌జ‌లు మ‌ర‌ణించ‌గా, ల‌క్ష‌లాది మంది క్ష‌తగాత్రులు అయ్యారు. ఇక మ‌న‌దేశంలోనూ ఇదే విధ‌మైన భూకంపం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోక‌పోతే పెను న‌ష్టం త‌ప్ప‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

దేశంలోని హిమాలయ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించవ‌చ్చున‌ని, ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లపై పెను ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని భారతదేశంలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) మంగళవారం తెలిపింది.

భారీ భూకంపం హిమాచల్ ప్రదేశ్‌ను తాకి, ఉత్తరాఖండ్ మరియు నేపాల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే బలమైన నిర్మాణాలు నిర్మించి, విధ్వంసం జరగకుండా అధికారులు సరైన నివారణ చర్యలు తీసుకుంటే ప్రాణనష్టాన్ని నివారించవచ్చున‌ని తెలిపింది.

NGRI యొక్క ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ N పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. "భూమి పొర‌ల్లో ఉండే ప్లేట్లు నిరంత‌రం క‌దులుతూ ఉంటాయి. భార‌త భూ భాగం కింద ఉండే ప్లేట్ సంవ‌త్స‌రానికి 5 సెం.మీ వేగంతో క‌దులుతుంది. దీంతో హిమాల‌య ప్రాంతంలో చాలా ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఒత్తిడి పెరగడం వల్ల పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉంది, ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో ఉండవచ్చు." అని చెప్పారు.

Next Story